Uncategorized

అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని.. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు.. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. అయితే ఒకే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని.. భద్రతపై పరిశ్రమలు, కార్మిక శాఖలు, అగ్నిమాపక విభాగంతోపాటు సంబంధిత విభాగాలన్నీ సమన్వయ సమావేశం నిర్వహించి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు.

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు గాయపడినవారు కోలుకునే వరకూ ఆర్థికసాయం అందించాలన్నారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం జగన్‌ పరిశీలిస్తారని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. అక్కడ వైద్యం కొనసాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్యుతాపురం వెళుతున్నారు.

మరోవైపు ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 106(1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు. ఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయగా.. నిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి అంశాలపై సెక్షన్లు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడినవారికి ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగుతోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు మరికాసేపట్లో అనకాపల్లి జిల్లాకు వెళ్లబోతున్నారు. అక్కడ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.. గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button