Uncategorized

హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది.

కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. 1.12 ఎకరాలు FTL పరిధిలో, మరో 2 ఎకరాల బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూగుల్ ఎర్త్ ఫోటోలతో సహా.. ఆధారాలు హైడ్రా అధికారులకు అందించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం నుంచే కూల్చివేతలు మెుదలు పెట్టారు. మధ్యాహ్నం వరకు మెుత్తం కన్వెన్షన్‌ను కూల్చేశారు.

ఈ కూల్చివేతలపై కాసేపటి క్రితం నాగార్జున స్పందించారు. కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయడం బాధాకరమన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారన్నారు. కన్వెన్షన్ కూల్చివేస్తున్నట్లు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తాము చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని, నిర్మాణాలు తమ పట్టా భూమిలోనే చేపట్టినట్లు వివరించారు. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా తాము ఆక్రమించలేదని అన్నారు. ప్రైవేట్ ల్యాండ్‌లోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నాగార్జున స్పష్టం చేశారు.

తాజా పరిణామాలతో మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చునని… వారి అభిప్రాయాన్ని పోగొట్టేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేయగా.. తాజాగా న్యాయస్థానం కూల్చివేతలపై స్టే విధించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button