Uncategorized

ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే

ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్‌లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్‌ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని రకాల ఆకుకూరలు రూ.2, రూ.20 లోపు ధర ఫిక్స్ చేశారు. అదే కూరగాయలను రూ.5, రూ.20పైన ఉండే కూరగాయలను రూ.10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఇల్లు, షాపులు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీపైన ఆలోచన చేస్తున్నామన్నారు. వరద దెబ్బకు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, స్టౌలు, ఫ్ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు పాడైపోయాయి, తలుపులు, వార్డ్‌రోబ్స్‌ సహా అన్నీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్‌పై ఫోకస్ పెట్టామని.. అగ్నిమాపక యంత్రాల ద్వారా ఇళ్లను, రోడ్లను శుభ్రం చేస్తున్నామని.. ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి 20 నిమిషాలు పడుతోందని తెలిపారు. ఇలా ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 250-300 ఇళ్లు శుభ్రం చేయొచ్చని.. విజయవాడకు ఇప్పటి వరకు 50 అగ్నిమాపక వాహనాలు వచ్చాయన్నారు. మరో 50కి పైగా అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామన్నారు.

మరోవైపు వరద బాధితుల కోసం కూరగాయలు భారీగా సేకరించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించామన్నారు చంద్రబాబు. ఎవరైనా కూరగాయల్ని, పాల రేట్లను పెంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారుల్ని ఆదేశించారు. నేటి నుంచి నుంచి క్రమంగా ఆహార సరఫరా తగ్గిస్తామని.. సాయం చేద్దామనుకునే దాతలు నాణ్యమైన ఆహారాన్ని లేదా పప్పుధాన్యాలను ఇవ్వాలని కోరారు. అంతేకాదు విజయవాడలో వరద బాధితుల కోసం తీసుకొచ్చిన పడవలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవేనని.. కొందరు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించారు.

విజయవాడలో 182 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. మొత్తం 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని.. గర్భిణుల ఫోన్‌నంబర్లు, లొకేషన్‌ తీసుకుని, వారిని ఆసుపత్రికి పంపేలా చూస్తున్నామన్నారు. విజయవాడలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామని..పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు.ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందం రాబోతోంది. వరద నిర్వహణ, రిజర్వాయర్‌ నిర్వహణ, డ్యామ్‌ సేఫ్టీ తదితర అంశాలను టీమ్ పరిశీలించబోతోంది. ఈ వరదల నుంచి తక్షణ ఉపశమనం కోసం అందించాల్సిన సాయం, ఇతర చర్యలపై కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button