22 గ్రామాలకు సోలార్ పవర్.. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు, డిప్యూటీ సీఎం ఆదేశం

తెలంగాణలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వివిధ శాఖల పరిధిలో వాడుకలో లేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలన్నారు. తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు.

సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా తొలిదశలో 22 గ్రామాలను ఎంపిక చేసుకొని రైతుల పొలాల్లో వ్యవసాయ పంపుసెట్లు, గ్రామాల్లోని ఇళ్లకు సంపూర్ణంగా సోలార్ విద్యుత్‌ ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చుతో ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో రెడ్కో, ఎస్పీడీసీఎల్‌ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. అన్నదాతలకు పంటల ద్వారానే కాకుండా అదనంగా సోలార్‌ పవర్ నుంచి కూడా ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లితోపాటు తన సొంత నియోజకవర్గం మధిరలోని సిరిపురం, మరో 20 గ్రామాలను తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో పూర్తి ఉచితంగా వ్యవసాయ పంపుసెట్లు, గృహాలకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

దీంతో పాటుగా స్వయం సహాయక సంఘాలకు 5 నుంచి 10 మెగావాట్ల సోలార్‌ పవర్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేలా వారిని ఆర్థికంగా ప్రోత్సాహకం అందించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలంగాణ విద్యుత్తు అవసరాలు సైతం తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వివిధ వర్గాలకు సైతం ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

కాగా, ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు, ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టేందుకు సోలార్ పవర్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వంటగ్యాస్ బదులుగా తర్వలోనే సోలార్ విద్యుత్ వినియోగ విధానం తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *