Uncategorized

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వేలు పెట్టిన పాక్.. తమదీ, కాంగ్రెస్‌దీ ఒకే వైఖరి అని వెల్లడి

జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఏ దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్తాన్ మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. తరచూ భారత్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. చీవాట్లు తింటోంది. అయినా మళ్లీ మళ్లీ మన దేశ అంతర్గత విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పాకిస్తాన్‌ది, కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి వైఖరి ఒకేలా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే విజయమని ఖవాజా ఆసిఫ్ జోస్యం చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తిరిగి ప్రవేశపెట్టే విషయంలో పాక్‌లో అధికారంలో ఉన్న షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు ఒకే వైఖరిని అవలంబిస్తున్నాయని పాక్‌ మంత్రి ఖవాజా ఆసీఫ్ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఓవైపు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. పాక్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే విజయం అని.. ఆ కూటమే అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఖవాజా ఆసిఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీ కూటమి ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏను తిరిగి పునరుద్ధరించడాన్ని ఎన్నికల అంశంగా చేశాయని.. ఆ విషయంలో వారిది, తమది ఒకే వైఖరి అని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button