Uncategorized

దసరాకు ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది.. ఈ నెల 2 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు మొదలుకాబోతున్నాయి. అయితే దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూళ్లకు వచ్చి వెళ్లే వారి కోసం అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్ల కోసం.. రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని నడుపుతున్నారు.

దసరా పండగకు సొంత ఊళ్లకు వచ్చే వారి కోసం ఈ నెల 4 నుంచి 11 వరకు 3,040 బస్సులు.. అలాగే దసరా సెలవుల అనంతరం తిరుగు ప్రయాణమయ్యే వారికి ఈ నెల 12 నుంచి 20 వరకు 3,060 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో కూడా హైదరాబాద్‌ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు ఏర్పాు చేస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి 400, విశాఖ నుంచి 320, రాజమహేంద్రవరం నుంచి 260.. మిగిలిన జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

దసరా సందర్భంగా నడుస్తున్న ప్రత్యేక బస్సులు అన్నింటిలోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు ప్రయాణికులు రాకపోకలకు కలిపి ఒకేసారి ముందుగా రిజర్వేషన్‌ చేసుకుంటే.. ఛార్జిలో 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ప్రయాణికుల కోసం హైదరాబాద్‌తో పాటూ మరికొన్ని ముఖ్య కేంద్రాల్లో అధికారులు, సూపర్‌వైజర్లను నియమించారు.. ఒకవేళ ఏదైనా రూట్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగితే, వెంటనే మరిన్ని సర్వీసులు పెంచుతామంటున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవుల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-తిరుమల ఘాట్‌లో అక్టోబరు 4 నుంచి 12 వరకు నిత్యం 1,930 ట్రిప్పులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. గరుడ సేవ సందర్భంగా ఈనెల 8, 9వ తేదీల్లో 2,714 బస్సులు నడపనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button