Uncategorized

ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్రంగా బలపడింది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.. బుధవారం నాటికి తుఫాన్‌గా, గురువారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారొచ్చని ఐఎండీ చెబుతోంది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ (ఒడిశా), సాగర్‌ ద్వీపం (పశ్చిమ బెంగాల్‌) మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా బలపడితే ఖతర్‌ సూచించిన దానా పేరును పెట్టనున్నారు.

ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయంటున్నారు. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 85.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తెలిపారు. ఇవాళ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి, బుధవారం (అక్టోబర్ 23) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడి ఆతర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందన్నారు.

బంగాళాఖాతంలో తుఫాన్ హెచ్చరికలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర కార్యదర్శులు, ఎన్డీఎంఏ మెంబర్, డిఫెన్స్ , ఎన్డీఆర్ఎఫ్ డీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, డీజీ ఐఎండీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూ శాఖ (ల్యాండ్స్, విపత్తుల నిర్వహణ, స్టాంప్స్& రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుఫాన్ హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button