Uncategorized

ఏపీలో అన్న క్యాంటీన్లకు యువ పారిశ్రామికవేత్త భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఆంధ్రప్రదేశ్‌లో అన్నక్యాంటీన్ల నిర్వహణకు, వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు సాయం అందిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాలు అందజేశారు. ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత సజ్జా రోహిత్ అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి..‌ అన్నక్యాంటీన్ల కోసం రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. అన్నా క్యాంటీన్ల కోసం భారీ విరాళం అందజేసిన సజ్జా రోహిత్‌‌ను చంద్రబాబు అభినందించారు.

మరోవైపు రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్ధం ఎస్‌కే యూనివర్సిటీ సిబ్బంది తరఫున జీ వెంకటనాయుడు రూ.17,34,786 చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అలాగే కుప్పం నియోజకవర్గం నుంచి సేకరించిన రూ.14.36లక్షలను.. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఈ మేరకు చెక్కును చంద్రబాబు అందించారు. అలాగే అన్న క్యాంటీన్ల కోసం కపిలేశ్వరపురం మాతృభూమి శ్రేయో సంఘం ప్రతినిధి కే రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా రూ.5,41,116 చెక్కును అందజేశారు. విరాళాలు అందజేసినవారిని చంద్రబాబు అభినందించారు.

మరోవైపు రాష్ట్రంలో గుంతల రోడ్లకు చెక్ పెడుతోంది ప్రభుత్వం. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌ (మిషన్‌ పాట్‌హోల్‌ ఫ్రీ ఏపీ) పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. నవంబరు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. రూ.860 కోట్ల నిధులతో గుంతలు పూడ్చటంతో పాటుగా అవసరమైన మరమ్మతులు చేపడతారు. అంతేకాదు కంపచెట్ల తొలగింపు, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పనులను మొదలుపెడతారు.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నాటికి ఎక్కడా గుంతలు కనిపించకూడదని చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గతంలో వర్షాలకు దెబ్బతిన్న వాటి మరమ్మతులకు ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి రూ.290 కోట్లు కేటాయించింది. అలాగే ఈ ఏడాది దెబ్బతిన్న రోడ్లకు రూ.300 కోట్లు విడుదల చేయనున్నారు. అంతేకాదు కంపచెట్ల తొలగింపు, కల్వర్టుల పనులకు రూ.50 కోట్లు, భారీ వర్షాలతో రోడ్లు తరచూ దెబ్బతినే పలు జిల్లాలకు మరో రూ.220 కోట్లతో శాశ్వత పనులు చేపడతారు.

రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరును పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సూచన చేయగా.. వెంటనే చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. సుబ్బారావు స్వస్థలం భీమవరం.. ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. అందుకే కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక దానికి ఆయన పేరు పెడితే బావుంటుంది అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button