Uncategorized

AP News: సెలవుపై వెళ్లిన ఐఏఎస్ ఆమ్రపాలి.. కారణం ఏంటంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఐఏఎస్ అధికారిణి పది రోజుల పాటూ సెలవుపై వెళ్లారు. ఆమ్రపాలి సెలవు నుంచి వచ్చే వరకు.. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు పర్యాటకాభివృద్ధి ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఆమెను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌గా నియమించగా.. ఈ నెల 6న బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పుడు సెలవులో వెళ్లారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులకు సంబంధించి.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీవోపీటీ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని ఐఏఎస్‌ అధికారులను ఆదేశించింది. ఆ వెంటనే ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వీరికి ఊరట దక్కలేదు. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఆమ్రపాలి, వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్ తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.. ఆ వెంటనే ఏపీలో రిపోర్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ వీసీఎండీగా ప్రభుత్వం నియమించింది.. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అలాగే కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. రోనాల్డ్ రోస్‌కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన నలుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.

ఏపీ నుంచి ఇటీవల తెలంగాణలో చేరిన ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్‌లు వచ్చాయి. ఏపీ నుంచి వచ్చిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్‌.. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా లోతేటి శివశంకర్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజనను నియమించారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ దక్కాయి. అదే క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button