బిజినెస్

Adani Bribe Case: ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. నాన్‌స్టాప్ భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.. మంగళవారం కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌ ఇలా పలువురు నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు.. కాగా.. పవన్ కల్యాణ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను పవన్ కల్యాణ్ కలిశారు.. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ -వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలియచేశారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.

అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకి ముందు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందంటూ పేర్కొన్నారు. దీంతోపాటు.. ఆదానీ కేసు గురించి కూడా మాట్లాడారు.. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారంటూ పేర్కొన్నారు. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరమని.. తీవ్ర ఆవేదన చెందుతున్నామంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అని.. భారత్ లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు..? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పాలస్తీనాలో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్‌లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరన్నారు.

రూ.110 కోట్ల ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని. అదే ఎర్ర చందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చంటూ పేర్కొన్నారు.. నేపాల్ నుంచి కూడా అలాగే రప్పించామన్నారు.. విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి చేరవేసే విధానం లేదని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో మాట్లాడానని.. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరానని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button