Uncategorized

అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు?.. ఎన్ని ఎకరాలంటే, కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు.. చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్‌ ప్లాట్‌‌గా చెబుతున్నారు.. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్‌ 25 వేల చదరపు గజాలు కాగా.. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉందని. అలాగే ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు కూడా ఉందని చెబుతున్నారు.

చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. అంతేకాదు రాజధానిలో కీలకమైన తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాల వంటి‌ భవనాలు ఈ ప్లాట్‌కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉన్నాయంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి.. మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్‌ వంటి అవసరాలు వినియోగించనున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రస్తుతం కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ ప్లాట్‌లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారట.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ నివాసంలోనే ఉంటున్నారు.. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పారు. తాజాగా భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతోందనే చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు చంద్రబాబు కేరాఫ్ ఉండవల్లి అనేవాళ్లు.. ఇకపై చంద్రబాబు కేరాఫ్ వెలగపూడిగా మారబోతోందనే చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు స్థలం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పనుల్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఎక్కువ సమయంలో అమరావతిలోనే ఉంటున్నారు.. ప్రస్తుతం లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. ఆయనకు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం లేదనే వైఎస్సార్‌సీపీ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button