Uncategorized

ఇదెక్కడి వెరైటీ రా మావా.! ఆవు దూడకు అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం.. ఎందుకంటే?

ఆవు దూడకు నామకరణం..అక్షింతలు వేస్తూ ఆశీర్వాదం..వింటేనే ఆశ్చర్యం వేస్తుందిగా.. వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో అవు దూడను ఉంచి ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు. అవు దూడ నుదుటికి బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తూ దానిని ఆశీర్వదించారు. ఎక్కడో తెలుసా?

పుట్టిన బిడ్డను 21వ రోజున ఘనంగా ఉయ్యాల వేడుక చేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే రోజున చాలామంది తమ బిడ్డలకు నామకరణం కూడా చేస్తుంటారు. అయితే ఇది మనుషులలో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. మరి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఒకే చోట ఏకమై ఓ ఆవు దూడకు నామకరణం ఫంక్షన్ చేశారు. ఆ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మనుషులకు ఏమాత్రం తీసిపోనీ విధంగా గ్రాండ్‌గా ఆవు దూడకు ఉయ్యాల ఫంక్షన్ సైతం నిర్వహించడం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ విషయం తెలుసుకున్న కొందరు తాము పెంచుకునే జంతువులకు సైతం మనుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు సిద్ధపడుతున్నారట. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామంలో 21 రోజుల ఆవు దూడకు ఉయ్యాల ఫంక్షన్లో భాగంగా నామకరణం కార్యక్రమాన్ని గ్రామస్తులు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అడ్డాడ రఘు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఈ నామకరణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయ లోగిళ్ళ వద్ద వస్త్రంతో ఉయ్యాలను ఏర్పాటు చేసి అందులో అవు దూడను ఉంచి ఊపుతూ మహిళలు మంగళ హారతులు పాడారు. అవు దూడ నుదుటికి బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తూ దానిని ఆశీర్వదించారు. అంతేకాకుండా ఉయ్యాలను రంగురంగుల బెలూన్లు, పూలతో డెకరేట్ చేశారు. అనంతరం ఆవు దూడకు శాస్త్రోక్తంగా నాగదేవిగా నామకరణం చేసి అందరూ నాగదేవి నాగదేవి అని పిలుస్తూ సందడి చేశారు. ఆ ఆవు దూడ పుట్టడానికి ముందు ఆవు వద్దకు ఓ పాము వచ్చిందని అందుకే ఆవు దూడకు నాగదేవిగా నామకరణం చేసినట్లు రఘు తెలిపారు. ఇలా ఆవుకి గతంలో అదే ఆలయం వద్ద శ్రీమంతం ఫంక్షన్ కూడా స్థానికులు నిర్వహించడం విశేషం. ఆలమందలను సైతం తమ కుటుంబ సభ్యులుగా భావించి నిడమర్రు గ్రామస్తులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం పట్ల వారిని పలువురు అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button