Uncategorized

అమరావతి పునఃనిర్మాణంపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. పనులపై కీలక భేటీ..

అమరావతి పునఃనిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్‌ చేస్తోంది. ఇందులో భాంగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. అలాగే విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, ప‌లు ప‌రిశ్రమ‌ల‌కు భూ కేటాయింపుల లాంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.

రూ. 24,276 కోట్ల పనులకు పాల‌న‌ప‌ర‌మైన ఆమోదం

సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజుల క్రితమే జరిగిన సీఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లే అవుట్ లలో మౌలిక వసతులు కల్పన, ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి మొత్తం రూ. 24,276 కోట్ల పనులకు పాల‌న‌ప‌ర‌మైన ఆమోదం కోసం గురువారం మంత్రి వ‌ర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వనున్నారు.

ఐదు టవర్లకు మొత్తంగా రూ.4,608 కోట్ల ఖర్చు

20 లక్షల 32 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భ‌వ‌నం నిర్మాణం కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం కోసం రానుంది. 55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మాణం చేయ‌నున్నారు. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేప‌ట్టనున్నారు. ఐదు టవర్ లకు గాను మొత్తంగా రూ. 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్ లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్ధాయిలో ప్రారంభం చేయాల‌న్న సీఆర్డిఏ ప్రతిపాద‌న‌లకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలపనుంది. మరోవైపు రెవెన్యూశాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి. వీటితోపాటు మరి కొన్ని అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button