Uncategorized

ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షల రద్దుపై ఇంటర్‌ బోర్డు యూటర్న్‌.. ఇక రద్దు లేనట్లే!

ఇంటర్మీడియట్‌ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణలపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేస్తే వచ్చే ప్రతికూలతల గురించి విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలపై శ్రద్ధ తగ్గుతుందని, చదువుపై దృష్టిపెట్టరని జనవరి 26 స్వీకరించిన సలహాలు, సూచనల్లో వారు పేర్కొన్నారు..

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గతంలో పలుమార్లు చెప్పింది. అయితే ఈ నిర్ణయంపై ఇంటర్ బోర్డు యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది.

దీనిలో భాగంగా ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలకు బదులుగా అంతర్గత పరీక్షల విధానం అమలు చేయానలి ఇంటర్‌ బోర్డు భావించింది. ఈ ప్రతిపాదనలపై జనవరి 26 వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టరని, దీంతో విద్యార్ధుల్లో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. ఈ సూచనల మేరకు ఇంటర్‌ బోర్డు అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తుంది. గణితంలో గతంలో మాదిరి ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్‌ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటన్నింటిపై త్వరలో ఇంటర్మీడియట్‌ విద్యా మండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనుంది. కాగా ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button