Uncategorized

ఏపీలో బర్డ్ ప్లూ నిర్ధారణ.. మరి చికెన్ తినొచ్చా…?

ఏపీలో పౌల్ట్రీ ఇండస్ట్రీని అల్లాడిస్తున్న వైరస్‌ని బర్డ్‌ఫ్లూగా తేల్చారు. చూస్తుండగానే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కోళ్లఫారాలున్న అన్ని చోట్లా హైఎలర్ట్‌ ప్రకటించారు..! రెండు ఫారాల్లోని కోళ్ల మృత్యువాత బర్డ్ ప్లూ కారణంగానే అని తేలడంతో.. ఆ ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని ల్యాబ్‌ టెస్ట్‌లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని భోపాల్‌లోని యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబ్‌ తేల్చింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కాకినాడ, ఏలూరు పశుసంవర్ధకశాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్తనమూనాలు తీసి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్‌5ఎన్‌1 పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయింది.

ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వేల్పూరు, కానూరు గ్రామాల పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేశారు. ఇక బర్డ్‌ ఫ్లూగా తేలిన రెండు ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి రూ.90 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్‌ వ్యాపించి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు జీవభద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయకపోవడం కూడా వ్యాధి విస్తరణకు కారణంగా చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్‌ బ్రతకలేదని… ప్రస్తుతం రాష్ట్రంలోని అధికశాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుంది.

బర్డ్‌ఫ్లూ అంటువ్యాధి.. ఇది మనుషులకూ వ్యాపించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు సూచించారు. ఇక వైరస్‌ సోకని కోడి మాంసాన్ని, గుడ్లును బాగా ఉడికించి తినాలన్నారు. కోడిమాంసం, గుడ్లను మనం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం. అప్పుడు ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని చెప్పారు. సరిగ్గా ఉడికించకుండా నిర్లక్ష్యం చేసి తింటే.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button