Uncategorized

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మొదట కొత్త రేషన్ కార్డులు అందేది ఆ జిల్లాల వారికే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసిన వారికి కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు పోస్ట్‌కార్డు సైజులో ఉండేలా రూపొందిస్తున్నారు. కార్డుపై ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం ఉంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ తదితర సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతికతగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ పొందుపరిచే యోచనలో ఉన్నారు.

బయోమెట్రిక్ ఆధారంగా సరఫరా..

రేషన్ షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్, బయోమెట్రిక్ విధానం ద్వారా నిత్యావసర సరఫరా సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే పారదర్శకత పెరిగి, అనర్హులకు రేషన్ సరఫరా నివారించేందుకు వీలవుతుంది.

మహిళల పేరుమీదనే కొత్త కార్డులు

ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందజేస్తోంది. అదే విధంగా, రేషన్ కార్డులను కూడా గృహిణి పేరుమీద జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా కుటుంబాలకు సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.

చిత్రాలు లేకుండానే కొత్త కార్డులు?

కుటుంబ ఫొటోలను కార్డుపై అద్దాలా? వద్దా? అనే అంశంపై చర్చలు జరిగాయి. తరచుగా కుటుంబ సభ్యుల్లో మార్పులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఫొటోలను ప్రదర్శించకుండా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎక్కడి నుంచి ప్రారంభం?

ప్రస్తుతం ఎన్నికల నియంత్రణ లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, రేషన్ కార్డులను ‘ఫుడ్ సెక్యూరిటీ కార్డులు (FSC)’గా పిలుస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో, కొత్త కార్డులు జారీ అయిన తరువాత ఈ సంఖ్య కోటి మార్కును చేరుకోనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button