Uncategorized

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు.

గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. కుల గణన సర్వే నేటితో ముగియనుండటంతో ఇంకా సర్వే లో పాల్గొనని వారు, ఎన్యుమరేటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వే లో పాల్గొనాలి కోరారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వే లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వే లో పాల్గొనలేదో అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. సర్వే లో పాల్గొనని వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నంబర్‌ 040-211 11111ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి ఎన్యుమరేటర్లే వచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారు seeepcsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button