Uncategorized

రైతు నేస్తం.. మరో సభకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

కాంగ్రెస్ సర్కార్ మరో సభకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాపై.. ప్రభుత్వ విజయాన్ని ప్రజల మధ్య పంచుకునేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో “రైతు భరోసా విజయోత్సవ సభ” నిర్వహించనున్నట్టు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొననున్నారని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రైతుభరోసా లబ్ధిదారులు హాజరుకాబోతున్నారు. రైతుల ఉత్సాహాన్ని ప్రోత్సహించేందుకు, వారి సంతోషాన్ని పంచుకునేందుకు ఈ సభను “రైతు నేస్తం వేదిక”గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రైతుల సాగు కార్యకలాపాలకు తొలకరిలో ముందుగానే భరోసా ఇచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల మేర నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇది రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.

మరోవైపు, గతంలో కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేసి అండగా నిలిచారన్నారు. అదే దారిలో ప్రస్తుతం తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ వర్తించిందని మంత్రి తెలిపారు.

సభ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూసేందుకు విద్యుత్, త్రాగునీరు, షామియానాలు, సీటింగ్ కెపాసిటీ, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష జరిగింది. సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్పష్టమైన సూచనలు చేసినట్టు మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button