Uncategorized

మిడిల్‌ క్లాస్‌కు గుడ్‌ న్యూస్‌.. GST స్లాబుల మార్పు..? ధరలు భారీగా తగ్గే వస్తువులు ఇవే!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లను పునర్నిర్మించాలని పరిశీలిస్తోంది. 12 శాతం GST ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది. ఇది మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది.

మధ్యతరగతి, దిగువ ఆదాయ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తూ గుడ్‌ న్యూస్‌ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌ల పునర్నిర్మాణాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం. కొన్ని ముఖ్యమైన వస్తువులపై GSTని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా తొలగించడంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 12 శాతం GST స్లాబ్‌లో ఉన్న వస్తువులలో చాలా వరకు పేద, మధ్యతరగతి పౌరులు రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులే ఎక్కువ. ఈ వస్తువులను 12 శాతం నుంచి 5 శాతం పన్ను స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. మరో ఆలోచనలో 12 శాతం స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి, అందులో ఉన్న వస్తువులను ఇప్పటికే ఉన్న తక్కువ లేదా అంతకంటే ఎక్కువ స్లాబ్‌లలోకి చేర్చే అవకాశం ఉంది. వెన్న, నెయ్యి, ప్రాసెస్ చేసిన ఆహారం, బాదం, మొబైల్స్, పండ్ల రసం, కూరగాయలు, పండ్లు, గింజలు లేదా మొక్కల ఇతర భాగాలు, ఊరగాయతో సహా మురబ్బా, చట్నీ, జామ్, జెల్లీ, ప్యాక్ చేసిన కొబ్బరి నీరు, గొడుగు వంటివి ప్రస్తుతం జీఎస్టీ 12 శాతం పన్ను స్లాబులో ఉన్నాయి. మరి వీటిలో వేటిని 5 శాతంలోకి తెస్తారో? వేటిని 12 శాతం కంటే ఎక్కువ పన్ను స్లాబులోకి చేరుస్తారో చూడాలి.

త్వరలో జరగనున్న 56వ GST కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం.. కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం, కానీ ఈ నెలాఖరులో సెషన్ జరగవచ్చని సమాచారం. అయితే ఒక వేళ ఈ స్లాబుల మార్పు చేస్తే.. ఇది రాజకీయంగా కీలక అంశంగా మారనుంది. ఎన్నికలకు ముందు ఏడాది జనాభాలో ఎక్కువ మంది వినియోగించే నిత్యావసర వస్తువులపై ధర తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. ఆయా వస్తువులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్‌టి కౌన్సిల్, పన్ను రేట్లలో మార్పులను సిఫార్సు చేసే అధికారం కలిగి ఉంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. 2017లో పరోక్ష పన్ను వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుండి జిఎస్‌టి రేట్లలో ఇది అత్యంత ముఖ్యమైన సవరణలలో ఒకటిగా నిలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button