Uncategorized

సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. స్పందించిన మారిషస్.. ఆఫ్‌షోర్ ఫండ్‌పై కీలక వ్యాఖ్యలు!

సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్ మాధబీ పురి బచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మారిషస్ దేశం స్పందించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించింది. ఆ సంస్థ చేసిన ఆరోపణల్లోనే కీలకమైన ఆఫ్‌షోర్ ఫండ్ తమ దేశంలో లేదని మారిషస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ స్పష్టం చేసింది. సెల్ కంపెనీలు సృష్టించేందుకు తమ దేశం అనుమతివ్వదని తేల్చి చెప్పింది.

 ఆగస్టు 10, 2024 రోజున హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన రిపోర్ట్‌లో మారిషస్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ ఒక చిన్న ఆఫ్‌షోర్ మారిషస్ ఫండ్ అని, ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అనేది మారిషస్‌లో నమోదైన ఫండ్ అని పేర్కొంది. అయితే ఐపీఈ ప్లస్ ఫండ్, ఐపీఈ ప్లస్ ఫండ్ 1 లకు ఫైనాన్షియస్ సర్వీసెస్ కమిషన్ ఎలాంటి లైసెన్సులు ఇవ్వలేదు. అవి మారిషస్‌లో లేనే లేవు’ అని స్పష్టం చేసింది మారిషస్ ఎఫ్ఎస్‌సీ. ఈ క్రమంలో మరోసారి హిండెన్‌బర్గ్ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలు ఇవే..

సింగపూర్‌లోని ఒక వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ సహాయంతో 2015లో సెబీ ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్, ఆమె భర్త మారిషస్‌లోని డొల్ల కంపెనీల్లో, బహిర్గతం చేయని మొత్తంలో పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత శనివారం ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువను కృత్రిమంగ పెంచేందుకు ఉపయోగించిన డొల్ల కంపెనీల్లోనే వారు ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపించింది.

సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ మరోసారి అదానీ గ్రూప్‌ను గురిపెట్టింది హిండెన్‌బర్గ్. అయితే, ఈసారి సెబీ చీఫ్‌ను ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ ఆఫ్‌షోర్ ఫండ్లలో వారికి పెట్టుబడులు ఉన్నందునే దర్యాప్తు సరిగా జరగలేదంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌ తీవ్రంగా ఖండించారు. గత ఆరోపణలపై నోటీసులు ఇచ్చినందుకే ఈ ఆరోపణలు చేసిందని, హిండెన్‌బర్గ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మరోవైపు.. అదానీ గ్రూప్ సైతం హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వ్యక్తిగత లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button