అమెరికా వాణిజ్య చర్చలకు భారత్ బృందం సిద్ధం

వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చల కోసం భారత ప్రతినిధి బృందం వచ్చేవారం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్లో సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.
ఫిబ్రవరిలో కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తుది ఒప్పందం మార్చిలోనే ఖరారవుతుందని భావించినప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడింది.
ఇక తాజాగా అమెరికా సుంకాల విధానంలో మార్పులు చోటుచేసుకోవడంతో పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్లో భారత్కు మరింత ప్రయోజనం కలిగేలా తుది ఒప్పందాన్ని రూపుదిద్దడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
