Uncategorized

ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. రెండు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది.. ఆదివారం తెల్లవారుజాముకు వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది.

ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఇవాళ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అయితే ఈ వాయుగుండం తుఫాన్‌గా మారే సూచనలు లేవని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వానలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.

శుక్రవారం కురిసిన వానలకు పలు జిల్లాల్లో వీధులు, రోడ్లు, కాలువలు జలమయం అయ్యాయి. లోతట్లు ప్రాంతాల ప్రజలు ఈ వానలతో ఇబ్బందిపడ్డారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 45.5, కడప జిల్లా పెద్దపసుపళ్లలో 37, అనకాపల్లి జిల్లా పరవాడలో 35.29, ప్రకాశం జిల్లా ఈదరలో 34.5, నంద్యాల జిల్లా పెద్దదేవళాపురంలో 34, కాకినాడ జిల్లా చొల్లంగిపేటలో 30మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button