Uncategorized

గుజరాత్‌‌కు ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. అస్నాగా నామకరణం

గుజరాత్‌కు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. కచ్‌ తీరం, పాకిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ తుఫాన్‌కు అస్నాగా పేరు పెట్టగా.. ఈ పేరును పాకిస్థాన్‌ సూచించింది. అరేబియా సముద్రంలో 1976 తర్వాత ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్‌ అని చెబుతున్నారు. కచ్‌ తీరం మీదుగా ఆవరించిన అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలోకి ఒమన్‌ దిశగా కదిలింది. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు అని చెబుతున్నారు.. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్‌ ఏర్పడింది అంటున్నారు. అరేబియా సముద్రంలో ఆగస్టులో 1891 నుంచి 1976 వరకూ మూడు తుఫాన్‌లు వచ్చాయి. గతంలో 1944, 1964, 1976 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో తుఫాన్‌లు వచ్చాయని చెబుతున్నారు.

గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి.. సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. గుజరాత్‌ భారీ వర్షాలకు 26 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం వానలు చిన్న బ్రేక్ ఇవ్వగా.. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్, భారీ వర్షాలతో అధికారలు అప్రమత్తం అయ్యారు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు.

ఈ వర్షాలు, వరదలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీశారు.. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఏర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

గుజరాత్‌లోని వడోదరలో వర్షాలతో విశ్వామిత్ర నది పొంగి పొర్లుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నది పక్కనే ఉన్న చాలా ఇళ్లలో మునిగిపోయాయి. ఈ వరదలో కొన్ని కుటుంబాలు చిక్కుకోగా.. వారిలో టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ స్పిన్న‌ర్‌ రాధా యాద‌వ్ కుటుంబం కూడా ఉంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రాధా యాదవ్ కుటుంబాన్ని కాపాడి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఈ విషయాన్ని రాధా యాదవ్ స్వయంగా తెలిపారు. వరదలో చిక్కుకున్న‌ తమ కుటుంబాన్ని ర‌క్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌కు ధ‌న్యవాదాలు తెలిపారు. మొత్తం మీద భారీ వర్షాలు, వరదలు గుజరాత్‌ను వణికిస్తున్నాయి.. ఇప్పుడు ఈ అస్నా తుఫాన్ భయం కూడా వెంటాడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్‌‌లు లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్నిసురక్షితమైన ప్రదేశాలకు చేర్చే పనిలో ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button