
ఏపీ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విశాఖలో ఓ విద్యార్థి చేసిన పని ఆసక్తికరంగా మారింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన అతడు, ఫలితాలు వెలువడకముందే ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను పాస్ చేయాలని కోరాడు.
తాను ఏమీ చదవలేదని, ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు రాసినట్లు విద్యార్థి తెలిపాడు. అంతేకాకుండా జవాబు పత్రంలో డబ్బు కూడా పెట్టానని చెప్పి, ఏదో విధంగా పాస్ చేయాలని అధికారులను అభ్యర్థించాడు.
ఈ విషయంపై స్పందించిన అధికారులు విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. త్వరలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా సిద్ధమై రాయాలని సూచించారు. అలాగే ఈ ఘటనను విశాఖ ఆర్ఐవోకు తెలియజేసి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని చర్యలు తీసుకున్నారు.
తరువాత జిల్లా అధికారులు విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడగా, తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటామని వారు తెలిపారు. కాగా, ఆ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో రెండు సబ్జెక్టులు, సెకండియర్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు సమాచారం.

