బిజినెస్

తిరుపతి: 150 గంటల్లోనే భారీ భవన నిర్మాణం పూర్తి.. ప్రపంచ రికార్డ్, ఈ టెక్నాలజీ అదిరింది

ఓ పరిశ్రమను నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది.. కనీసం ఆరునెలల నుంచి ఏడాది మాత్రం పక్కా. తిరుపతి జిల్లాలో మాత్రం అలా కాదు.. కేవలం 150 గంటల్లో ఏకంగా లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. తిరుపతి జిల్లాలోని తడ సమీపంలోని మాంబట్టు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) నిర్మాణ సంస్థ ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ ఈ పరిశ్రమను నిర్మించింది. కేవలం 150 గంటల్లోనే ఒక భారీ పరిశ్రమను నిర్మించి రికార్డు సృష్టించారు. దేశంలోనే అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన పరిశ్రమగా గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.

ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా.. పర్యావరణానికి అనుకూలంగా ఈ నిర్మాణాలను చేపట్టినట్లు ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ ఎండీ సంజయ్‌ సింఘానియా తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి తాము ఎదురు చూస్తున్నామన్నారు. పీఈబీ టెక్నాలజీతో వేగంగా నిర్మాణాలు చేపడుతున్నామని.. వేగంతో పాటుగా నాణ్యత విషయంలో కూడా రాజీ లేదన్నారు. తమ ఈప్యాక్ ప్రీఫ్యాబ్ తక్కువ ఖర్చుతో నాణ్యంగా, స్థిరమైన నిర్మాణాలు చేపడుతుందన్నారు.. తమకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందంటున్నారు.

ఈ పరిశ్రమకు అవసరమైన నిర్మాణాన్ని.. మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీ ఫ్యాబ్రికేషన్‌, పీఈబీ టెక్నాలజీతో నిర్మించారు. కేవలం 150 గంటల్లోనే పూర్తి చేసి.. మంగళవారం ప్రారంభించారు. పీఈబీ టెక్నాలజీ సాయంతో.. అత్యంత వేగంగా నిర్మించడం ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ సాధించిన గొప్ప మైలురాయి అన్నారు ఎండీ సంజయ్‌ సింఘానియా. ఈ సందర్భంగా గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఆసియా హెడ్‌ మనీష్‌ వైష్ణోయ్‌ ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ టీమ్‌ను ఘనంగా సత్కరించి.. వారికి సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ నిర్మాణాన్ని దశలవారీగా ప్లాన్ చేశారు.. మొదటగా ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తి చేశారు. ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తైంది. ఇలా అనుకున్న సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button