Uncategorized

ఎంతమంది పిల్లలు ఉన్నా ఓకే.. కీలక బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ నిబంధనలు మార్చే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను మారుస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో మున్సిపల్, శాసనాల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా పట్టణ, స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం, గవర్నర్ సంతకం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మరోవైపు జ‌నాభా వృద్ది రేటు పెంపుద‌ల‌లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు,

వీటితో పాటుగా ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్‌ సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు -2024, ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024, ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు -2024, ఆయుర్వేదిక్‌ హోమియోపతి మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ చట్ట సవరణ, ఏపీ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణ బిల్లు-2024 బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఏడు కీలక బిల్లుల ఆమోదం తర్వాత.. అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.

మరోవైపు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు తొలుత ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో దీనిని వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు. దీనిపై అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే హెల్త్ వర్సిటీ పేరు మారుస్తామంటూ నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రకటించారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించగా.. తాజాగా అసెంబ్లీలోనూ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. మండలి ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button