బిజినెస్

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి గుడ్‌న్యూస్.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

Bank Deposits: గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి బ్యాంకులు. అయితే, ఇతర పెట్టుబడి మార్గాల్లో అంతకు మించిన రాబడులు వస్తున్న క్రమంలో బ్యాంకుల్లో డిపాజిట్ (Fixed Deposits) చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. డిపాజిట్లు తగ్గినట్లయితే అది బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజల నుంచి డిపాజిట్లు ఆకర్షించేందుకు వినూత్న ప్రొడక్టులను తీసుకురావాలన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఇచ్చే రుణాలకు, డిపాజిట్ల మధ్య సమతూకం ఉండాలని సూచించారు. డిపాజిట్ల సేకరణ అంశంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. డిపాజిట్ల ద్వారా వచ్చిన నిధులను అవసరమైన వారికి లోన్లు అందించాలని సూచించారు. అలా చేసినప్పుడే రుణాలకు, డిపాజిట్లకు మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని సూచించారు. అందుకోసం బ్యాంకులు వినూత్న, ఆకర్షణీయమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొచ్చి డిపాజిట్లను పెంచుకోవాలన్నారు.

బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడారు. వడ్డీ రేట్లను డీ రెగ్యులేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు బ్యాంకులు సొంతంగా డిపాజిట్లను పెంచుకునేందుకు వడ్డీ రేట్లను పెంచే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. వడ్డీ రేట్లను పెంచుకునే విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆర్‌బీఐ మానీటరీ పాలసీ సమీక్ష నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగానూ డిపాజిట్ల విషయాన్నీ ప్రస్తావించారు గవర్నర్ శక్తికాంత దాస్. బ్యాంకుల్లో నిధుల కొరత ఏర్పడితే అది బ్యాంకు పని తీరును దెబ్బతీస్తుందన్నారు. డిపాజిట్లు పెంచుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button