Uncategorized

బోరున ఏడ్చిన భారత అభిమాని.. సారీ చెప్పిన సంజూ శాంసన్, వీడియో వైరల్

దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 283/1 పరుగులు చేసింది. అనంతరం ఆతిథ్య సౌతాఫ్రికాను 148 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచులో సంజూ శాంసన్, తిలక్ వర్మ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ బాదిన ఓ సిక్సర్.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న మహిళా అభిమానిని ఏడిపించింది.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు రెండు ఇన్నింగ్స్‌లలో సంజూ శాంసన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా సత్తా చాటాలని భావించిన సంజూ.. ఆది నుంచే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తాను అనుకున్నట్లుగానే.. సరైన సమయం వరకూ వేచి చూసి, బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలో సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోష్ కొనసాగించాడు.

ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో స్టబ్స్ వేసిన రెండో బంతిని.. డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు సంజూ శాంసన్. అయితే బంతి నేరుగా వెళ్లి తొలుత సెక్యూరిటీ గార్డును తాకింది. ఆ తర్వాత స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళ అభిమానిని తాకింది. దీంతో ఆమె దవడకు గాయమైంది.బంతి బలంగా తాకడంతో ఆమె నొప్పితో విలవిల్లాడింది. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే ఐస్ తీసుకొచ్చి.. ఆమె దవడకు ట్రీట్మెంట్ చేశాడు. అయినా, నొప్పి తగ్గకపోవడంతో ఆమె బోరును ఏడ్చేసింది. షాట్ బాదగానే ఈ విషయం గమనించిన సంజూ శాంసన్.. వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వాస్తవానికి గాయపడ్డ లేడీ ఫ్యాన్ బంతిని మొదటే గమనించింది. కానీ, తన వరకు రాకపోవచ్చని అంచనా వేసినట్లు కనిపిస్తోంది. కానీ, సెక్యూరిటీ గార్డును తాకిన తర్వాత బంతి వచ్చి ఎగిరివచ్చి ఆమెకు తగలడంతో ఆమె గాయపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button