Uncategorized

శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కదలికలపై నిఘా పెట్టారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేశారు. ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 77,598 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు మొత్తం 194.30 టీఎంసీల నీరు ఉంది.. కుడి, ఎడమ కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. 68,211 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు అధికారులు.

నాగార్జునసాగర్‌ జలాశయంలో 588.80 అడుగులు నీటిమట్టంతో 308.4658 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి 47,035 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మళ్లీ సాగర్‌ రేడియల్‌ క్రస్ట్‌గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది.

శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల‌ను మూసివేస్తున్నారని తెలియడంతో చేప‌ల వేట‌పై ఆధార‌ప‌డిన మ‌త్స్య‌కారులు భారీ పెద్ద సంఖ్య‌లో తెప్ప‌ల‌తో డ్యామ్ దగ్గరకు వచ్చారు. అధికారులు ప్రాజెక్టు గేట్ల‌ను అలా మూశారో లేదో.. ఇలా వంద‌ల సంఖ్య‌లో మ‌త్య్స‌కారులు త‌మ తెప్ప‌ల‌తో చేప‌ల వేట‌కు వచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button