Uncategorized

దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు.. 

కాలంతో పాటు రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఉన్న సాంకేతికతో అధునాతన సౌకర్యాలతో కోచ్‌లు, సెమీ-హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. కొత్త రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల తరహాలో స్టేషన్ల తీర్చిదిద్దుతోన్న కేంద్ర ప్రభుత్వం.. వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న ఈ రైళ్లు తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.. ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేస్తున్నాయి.

కాగా, వందేభారత్ కంటే ముందే ప్రారంభమైన ఓ సూపర్ ఫాస్ట్ రైలు కేవలం మూడు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. బయలుదేరిన స్టేషన్ నుంచి నాన్-స్టాప్‌గా 493 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీంతో దేశంలో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించిన రైలుగా గుర్తింపు పొందింది ముంబయి సెంట్రల్- హపా దురంతో ఎక్స్ ప్రెస్. ముంబయి సెంట్రల్ నుంచి గుజరాత్‌లో జామ్‌నగర్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ప్రతిరోజూ రాత్రి 11.00 గంటలకు ముంబయి సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నాన్ స్టాప్ గా 493 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. తెల్లవారుజామున 4.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి అరగంట ఆగిన తర్వాత ఆ స్టేషన్ నుంచి బయలుదేరి సురేంద్రనగర్ జంక్షన్, రాజ్‌కోట్ ఈ రెండు స్టేషన్లలో మాత్రమే ఆగి.. అనంతం జామ్‌నగర్‌ (హపా)కు బయలుదేరుతుంది.

దీని తర్వాతి స్థానంలో పుణే- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. ఈ రైలు ఓ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడా ఆగకుండా 468 కి.మీ. ప్రయాణిస్తుంది. దీంతో పాటు ముంబయి- న్యూఢిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా ఎక్కడా ఆగకుండా 465 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాతే తొలి స్టాప్ ఉంది. ఇది ముంబయి స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత 465 కి.మీ. దూరం ప్రయాణించి రాజస్థాన్‌లోని కోటా స్టేషన్‌ వద్ద ఆగుతుంది. భారతీయ రైల్వేలో ఇటువంటి రికార్డులు ఎన్నో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చు భద్రతతో కూడిన ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో మన రైల్వేలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేలు ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలిచింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button