Uncategorized

విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?

RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

2024, నవంబర్ 12వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన తర్వాత బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోతాయని, ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బ్యాంకును పూర్తిగా మూసి వేసి ఒక లిక్విడేటర్‌ను నియమించాలని కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించింది. మంగళవారం నుంచే బ్యాంక్ పూర్తిగా మూతపడిపోయినట్లయింది.

ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?

బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ లిక్విడేషన్ ప్రక్రియ చేపడతారు. దీని ద్వారా ప్రతి డిపాజిటరు తమ డిపాజిట్ బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. బ్యాంకు ఇచ్చిన లెక్కల ప్రకారం 95.8 శాతం మంది డిపాజిటర్లు తమ డబ్బులను పూర్తిగా పొందనున్నారు. 2024, ఆగస్టు 31 నాటి లెక్కల ప్రకారం 9.84 కోట్ల డిపాజిట్లను డీఐసీజీసీ చెల్లించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దాదాపు ప్రతి ఖాతాదారుకు పూర్తి స్థాయిలో సొమ్ములు అందినట్లవుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button