Uncategorized

కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాత్రికిరాత్రే కూల్చివేత.. సర్కార్ ఇచ్చిన 15 రోజులకే..!

పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కిన్నెర మొగులయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవలే (సెప్టెంబర్ 24న) హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే.. ఆ భూమి పట్టాను మొగులయ్యకు అందించారు. దీంతో.. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య.. మొదట తన సొంత ఖర్చుతో చదును చేసుకుని చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటుచేసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే ఆ కాంపౌండ్ వాల్‌ను ఎవరో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే అక్కడి వెళ్లి చూసిన మొగులయ్య.. ధ్వంసమైన కాంపౌండ్ వాల్ చూసి.. హతాశుడయ్యాడు. ఎవరు ధ్వంసం చేశారు.. ఎందుకు చేశారన్నది తెలియక అయోమయంలో పడ్డాడు.

వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు.. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. స్థానికుల సహాయంలో.. దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

సెప్టెంబర్ 24న దర్శనం మొగులయ్యకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటి స్థలాన్ని అందించింది. హయత్‌నగర్‌లో 600 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. మొగులయ్యకు అందజేశారు. ఈ క్రమంలోనే.. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణకు మొగులయ్య కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇంతలోనే ఇలా జరగటం ఇప్పుడు మొగులయ్యను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

తనకు జరిగిన అన్యాయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని మొగులయ్య వేడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు కూడా మొగులయ్యకు అండగా నిలుస్తున్నారు. తన అరుదైన కళతో గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్యకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button