Uncategorized

గన్ లైసెన్స్ కోసం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దరఖాస్తు.. కూటమి ప్రభుత్వానికి మరో రిక్వెస్ట్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీనివాస్ కుటంబంలో వివాదాలు రోడ్డెక్కాయి.. ఆయన ఇద్దరు కూతుళ్లు టెక్కలిలో ఇంటి ఎదురుగా నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది. అయితే దువ్వాడకు సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది.. శ్రీనివాస్ గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసుల్ని కలిసి దరఖాస్తు అందజేశారు. కొద్దిరోజులుగా తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. కొందరు వ్యక్తులు తన ఇంటి దగ్గర అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాలతో తన దగ్గర గన్ ఉండాలని.. అందుకే లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాస్ కోరారు. జులై నెలలో కూడా ఇదే విషయంపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నంబర్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే కొందరి నుంచి తనకు ప్రాణ హానీ ఉందని.. అందుకే తనకు 4+4 గన్‌మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి కూడా విన్నవించారు.

మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌‌కు ఇంటిపోరు ఎదురవుతోంది. ఆయన ఇద్దరు కుమార్తెలు టెక్కలి అక్కవరం దగ్గర నివాసం ముందు నిరసనకు దిగారు. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని అక్కడే వేచి ఉన్నారు.. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకే అక్కడే ఉండిపోయారు. తండ్రి శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నారని.. ఆమె ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము బయట నుంచి పిలిచినా ఇంటి గేట్లు తీయడం లేదని మండిపడ్డారు. తమ తల్లిదండ్రులు చట్టపరంగా విడాకులు కూడా తీసుకోలేదని.. అలాంటప్పుడు ఆ మహిళ తమ తండ్రితో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో వివాదం రేగినట్లు చెబుతున్నారు. శ్రీనివాస్‌కు, భార్య వాణికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.. ఎన్నికలకు ముందు కూడా టెక్కలి సీటుపై వివాదం జరిగింది. ముందు దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి నుంచి పోటీ చేస్తారని ప్రకటించగా.. ఆ తర్వాత వాణిని టెక్కలి ఇంఛార్జ్‌గా నియమించారు. మళ్లీ కొంతకాలానికే సీన్ మారిపోయింది.. మళ్లీ వాణిని కాదని శ్రీనివాస్‌ను 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయగా.. అచ్చెన్నాయుడు చేతిలో టెక్కలి నియోజకవర్గంలో ఓడిపోయారు. అయితే వాణి వైఎస్సార్‌సీపీ నుంచి ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటి వరకు స్పందించలేదు. . అలాగే సతీమణి వాణి కూడా మాట్లాడలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button