పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగాయి.

మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలున్న హరియాణాలో ఒకే విడతలో ఎన్నికలు జరగున్నాయి. అక్టోబరు 1న పోలింగ్ నిర్వహించి.. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. హరియాణా అసెంబ్లీకి నవంబరు 6తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ గడువులోగా ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది.

కశ్మీర్‌లో సెప్టెంబరు 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు, గత నెల కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రహోదాను పునరుద్దరించి, త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి.. భద్రత సహా ఏర్పాట్లును సమీక్షించింది.

ఇక, అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మర్నాడు ఆగస్టు 20న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో 87 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో కొత్త ఓటర్లు 3.70 లక్షల మంది. అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *