Uncategorized

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున.. ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఓ జ్యువెలరీ షాప్‌కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే. ఈ జ్యువెలరీ షాపు అనంతపురంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. అయితే ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం అనంతపురం వెళ్లిన అక్కినేని నాగార్జున వరదల్లో చిక్కుకుపోయారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హీరో నాగార్జున మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఓ ప్రైవేట్ విమానంలో అక్కడి నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక పుట్టపర్తి ఎయిర్ పోర్టు నుంచి అనంతపురానికి కారులో బయల్దేరగా.. మార్గమధ్యలో ఇరుక్కుపోయారు. భారీ వర్షాల కారణంగా ధర్మవరం నుంచి అనంతపురం వెళ్లే రహదారిపై వరదనీరు ప్రవహించి వాహనాల రాకపోకలకు విఘాతం కలిగింది. దీంతో కారులో ఉన్న నాగార్జున అక్కడే చిక్కుకుపోయారు. అయితే నిర్వాహకులు మరో మార్గంలో అక్కడి నుంచి నాగార్జునను అనంతపురం తీసుకువెళ్లారు. చివరకు అనంతపురం చేరుకున్న అక్కినేని నాగార్జున .. జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button