Uncategorized

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని.. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీకి రెఫర్‌ చేసి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఏపీ, తెలంగాణ ఉద్యోగుల బదిలీల కోసం తెలంగాణకు ఇప్పటికే లేఖ రాశామని.. అక్కడి నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని తెలంగాణతో చర్చలు ప్రారంభించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రెండు రాష్ట్రాల నుంచి సీనియర్‌ అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీలను ఏర్పాటు చేశారని.. ఈ రెండు కమిటీలు విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక సీనియర్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఈ కమిటీలు ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయని.. ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీ సమస్యను కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తామన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంతో పాటు ఉద్యోగుల విభజనపై కూడా సీఎస్ కమిటీ పరిశీలన చేస్తోందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button