Uncategorized

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం.. పుట్టిన రోజునే శ్రీకారం..!

సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.

అనంతరం.. “మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర” పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను వాడపల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు సాగనుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే.. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. వాడపల్లి నుంచి తాను చేయనున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆరోజు చెప్పినట్టుగా.. ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button