Uncategorized

Fengal Cyclone: వామ్మో.. హడలెత్తిస్తున్న ‘ఫెయింజల్‌’ తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఫెయింజల్ తుఫాన్‌ తమిళనాడును వణికిస్తోంది. కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం.. సముద్రాన్ని తలపిస్తోంది. చెన్నైతో పాటు మరో 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెంగల్‌పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఫెయింజల్‌ తుఫాన్‌.. ప్రస్తుతానికి మహాబలిపురంకి 50కి.మీ, పుదుచ్చేరికి 80 కి.మీ, చెన్నైకి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతోంది. పుదుచ్చేరి సమీపంలో తీరందాటే అవకాశం ఉంది. తీరాలకు చేరుకునే సమయంలో నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని.. రాత్రికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది తీరం దాటే సమయంలో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.. తుఫాన్‌ బీభత్సంతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. వరదల ధాటికి రహదారులు చెరువులుగా మారాయి. వరదనీటిలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాన్‌ భయంతో… ఫ్లై ఓవర్లపై కార్లను పార్కింగ్‌ చేశారు. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చెన్నై ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ రాత్రికి చెన్నైలో కుండపోత వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఫెయింజల్ తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తమిళనాడు సీఎం స్టాలిన్‌.

ఇక ఫెయింజల్‌ తుఫాన్‌ బీభత్సం.. దక్షిణకోస్తా, రాయలసీమపై కూడా కనిపిస్తోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో..భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 70-90 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

తిరుపతి విమానాశ్రయంలో 4 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం లోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం , నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

తుఫాన్ ప్రభావంతో.. గూడూరు,కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై-తడ జాతీయ రహదారిపై భారీగా వర్షపునీరు చేరింది.

బాపట్ల జిల్లా రేపల్లెలో శుక్రవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. వరి కోతకు వచ్చిన వేళ…తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలోని ఈ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్..

ఫెయింజల్ తీరం దాటనున్న తరుణంలో తిరుపతి నెల్లూరు జిల్లాకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button