సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో.. వాతావరణం హాట్ హాట్గా మారింది. 2 లక్షల మేర రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన ఛాలెంజ్ను ఉటంకిస్తూ.. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. రుణమాఫీ చేశాం.. హరీశ్రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో సిద్దిపేటలో శుక్రవారం అర్ధరాత్రి పూట ఉద్రిక్తత నెలకొంది.
కాగా.. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్కు చెందిన కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి తెగబడ్డారు. గేటును బద్దలుకొట్టుకుని లోపలికి ప్రవేశించిన హస్తం పార్టీ కార్యకర్తలు.. ఆఫీస్పై ఉన్న హరీశ్రావు ఫ్లెక్సీని చింపేస్తూ నానా హంగామా చేశారు. హరీశ్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చ చేశారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయం చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.
కట్ చేస్తే.. ఉదయం వరకు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో.. సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని హరీశ్రావు విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు.
మరోవైపు.. సిద్దిపేటలో జరిగిన ఘటనలపై హైదరాబాద్లో పనిచేసిన యూకే మాజీ హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ స్పందించారు. ఎమ్మల్యే క్యాంప్ ఆఫీసు మీద జరిగిన దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు చూస్తూ నిద్రలేవడం బాధాకరమని తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. హరీశ్ రావుతో తనకు ఎంతో పరిచయం ఉందని, ఆయన పట్ల తనకు వ్యక్తిగతంగా అమితమైన గౌరవం ఉన్నట్లు ఫ్లెమింగ్ వెల్లడించారు.
హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ క్రమంలో హరీశ్రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించేశారు.
ఈ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు హరీశ్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా, ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనలతో సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.